ప్రణయ్‌ హత్యలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం.. ప్రముఖుల పాత్ర..!

  • 6 years ago

తన భర్త ప్రణయ్‌ హత్యలో నకిరేకల్‌ తాజా మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పాత్ర ఉందని అమృత వర్షిణి సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తమను బెదిరించారని, తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఫోన్‌ చేశారని తెలిపారు. తన తండ్రికి వేముల వీరేశంతో మంచి సంబంధాలున్నాయన్నారు. ప్రణయ్‌ హత్యలో ఆయన పాత్ర కూడా ఉందని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. వేముల వీరేశం తమను బెదిరించాడని తన వద్దకు వచ్చి మాట్లాడాలని ఫోన్‌ చేశారన్నారు. తన భర్త మృతదేహాన్ని చూసి చలించిన అమృత ఆవేశంగా మాట్లాడారు. ప్రణయ్ హత్యలో వీరేశం పాత్ర ఉందంటూ రోదించారు. తన మామ బాలస్వామి ఎల్‌ఐసీలో ఉద్యోగిగా పని చేస్తుండగా అతనిపై కేతేపల్లి పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేయించారని ఆరోపించారు.
తన మామను రెండు రోజుల పాటు కేతేపల్లి పోలీస్ స్టేషన్లోనే ఉంచి నకిరేకల్‌ వెళ్లాల్సిందిగా సూచించారని అమృత తెలిపారు. దీంతో తాను ప్రణయ్‌ కలిసి హైదరాబాద్‌ రేంజీ ఐజీ స్టీఫెన్ రవీంద్రను కలిసి విషయం చెప్పానని, ఐజీ అప్పటి నల్గొండ ఎస్పీ శ్రీనివాస్ రావుకు ఫోన్ చేసి తమ విషయం పరిశీలించాలని, రక్షణ కల్పించాలని ఆదేశించారని గుర్తు చేసుకున్నారు. ఎస్పీ శ్రీనివాస్ రావు, డీఎస్పీ శ్రీనివాసులు జోక్యం చేసుకోవడంతో తప్పుడు కేసు తొలగించారన్నారు. అమృత ఆరోపణల నేపథ్యంలో ప్రజా సంఘాల నాయకులు ప్రణయ్‌ అంతిమయాత్రలో వీరేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలన్నారు.

Recommended