ఏప్రిల్‌ 20న నిరాహార దీక్ష : చంద్రబాబు

  • 6 years ago
Andhra Pradesh Chief Minister Chandrababu Naidu to sit on a day long hunger strike on 20th April against Central Government over demand of special status for the state

తెలుగుదేశం సత్తా ఎంతో దేశానికి చూపుతామని ఆ పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర సమస్యలు, కేంద్ర వైఖరికి నిరసనగా నిరాహార దీక్ష చేయనున్నట్లు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ హక్కుల సాధనలో రాజీపడబోమని స్పష్టంచేశారు.
అంబేడ్కర్‌ జయంతి వేడుకల సందర్భంగా గుంటూరు జిల్లాలోని తుల్లూరు మండలం శాఖమూరులో రూ.100 కోట్లతో 20 ఎకరాల్లో నిర్మించబోయే అంబేడ్కర్‌ స్మృతివనం ఆకృతిని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఆయన మాట్లాడారు.
హేతుబద్ధత లేని విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును, ప్రతిపక్షాల వ్యవహార శైలిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రేపు ఢిల్లీని శాసించబోయేది టీడీపీనే అని అన్నారు. తాను పోరాడుతున్నది కేంద్రంపైన, నరేంద్ర మోడీపైన అన్నారు. ఒకప్పుడు కేంద్రంలో చక్రం తిప్పామని, భవిష్యత్తులోనూ చక్రం తిప్పుతామని అన్నారు. తాను ఈ నెలలోనే పుట్టానని, ఏప్రిల్‌ 20న ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహార దీక్ష చేయాలనుకుంటున్నట్టు వెల్లడించారు.
ప్రధాని మోడీ కూడా మొన్న పార్లమెంట్‌ జరగలేదని నిరాహార దీక్ష చేశారన్నారు. పార్లమెంట్‌ జరగపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. నిరాహార దీక్షతో కేంద్రానికి తన నిరసన తెలియజేస్తానన్నారు. అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.హక్కుల కోసం పోరాడేందుకే ఏప్రిల్ 30న పెద్ద మహాసభ పెడుతున్నామన్నారు. ప్రతిఒక్క ఇంట్లో దీనిపై చర్చ జరగాలని చంద్రబాబు ఆకాంక్షించారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం లాలూచీ రాజకీయాలు చేస్తున్నారన్నారని వైసీపీని ఉద్దేశించి చంద్రబాబు ఆరోపించారు.

Recommended