Encounter : Ten Maoists And A Constable Lost Life
  • 6 years ago
Ten Maoists and a constable of elite commando force Greyhounds were lost life in an encounter in the forests of Chhattisgarh’s Bijapur district bordering Telangana, the police said on Friday.

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో శుక్రవారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిందని భద్రాచలం జిల్లా ఎస్పీ అంబర్‌ కిశోర్‌ ఝా తెలిపారు. ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్టు ఆయన వెల్లడించారు. ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ మృతి చెందాడని ఎస్పీ చెప్పారు.
పూజారికాంకేడ్‌ ప్రాంతంలో గత కొంతకాలంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు తమకు సమాచారం అందిందని ఎస్పీ తెలిపారు. పూజారికాంకేడ్‌లో మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు సైతం ఎదురుకాల్పులకు దిగారని తెలిపారు.
అనంతరం పోలీసులు సోదాలు జరిపి పది మంది మావోయిస్టుల మృతదేహాలు గుర్తించినట్టు ఎస్పీ చెప్పారు. చనిపోయిన మావోయిస్టుల్లో ఆరుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నట్టు వివరించారు. పూజారికాంకేడ్‌ ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు జరుగుతున్నాయన్నారు.
మృతుల ఆచూకీ గుర్తించి మృతదేహాలను బంధువులకు అప్పగించనున్నట్టు చెప్పారు. మూడు నెలలుగా మావోయిస్టుల కార్యకలాపాలు ఎక్కువయ్యాయని తెలిపారు. ఘటనా స్థలిలో ఒక ఏకే 47, ఇంకొక ఎస్‌ఎల్‌ఆర్‌, రాకెట్‌ బాంబులు, రూ.43వేల నగదు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ వివరించారు.
ఎదురు కాల్పుల్లో గ్రేహౌండ్స్‌ కానిస్టేబుల్‌ సుశీల్‌కుమార్‌ మృతిచెందాడని తెలిపారు. ఇప్పటివరకు అమరుడైన కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను భద్రాచలం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.
ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను గుర్తించే పని సాగుతోంది. ఎన్‌కౌంటర్‌లో మరణించిన పది మంది మావోయిస్టుల మృతదేహాలు భద్రాచలం ఏరియా ఆస్పత్రికి చేరుకున్నాయి. మృతుల్లో ఒకరిని గుర్తించారు. వరంగల్ జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శి దడబోయిన స్వామి అలియాస్ ప్రభాకర్‌ను గుర్తించారు. ఆయనది వరంగల్ జిల్లా మడికొండ శివారులోని రాంపేట. మృతుల్లో కంకణాల రాజిరెడ్డి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.